ఆంధ్రా పల్స్
Date of Publish : 24 August 2026, 10:40 am Posted by : ఆంధ్రా పల్స్

ఇవాళ, రేపు వానలు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

ఆంధ్రా పల్స్ – హైదరాబాద్: రాష్ట్రంలో సోమ, మంగళవారం రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయని తెలిపింది. రుతుపవన ద్రోణి కూడా అల్పపీడన కేంద్రం మీదుగా సాగుతుండటంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని, దీని ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ముఖ్యంగా సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తన నివేదికలో తెలిపింది. కుమ్రంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, బయటకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మంగళవారం కూడా రాష్ట్రంలోని దాదాపు 22 జిల్లాల్లో ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వరకు అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.

బుధవారం నుంచి వర్షాల తీవ్రత తగ్గుముఖం పడుతుందని, ఆ తర్వాత మూడు రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. రైతులు వాతావరణ సూచనలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ సిటీలో రాగల 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదయ్యే చాన్స్ ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు నగరంలో గరిష్టంగా 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 26.0 మిమీ వర్షపాతం రికార్డయిందని, గాలిలో తేమ శాతం 92గా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.